28, సెప్టెంబర్ 2012, శుక్రవారం

కృతజ్ఞుడు-కృతఘ్నుడు

కృతజ్ఞుడు అనగా చేసిన మేలు మరువని వాడు.అలాగే కృతఘ్నుడు అంటే చేసిన మేలు మరచిపోయేవాడు.మరి ఈ ఇద్దరికి భేదం తెలుసు కొనేలా ఒక కధ ఉంది                         
             ఒక ఊరిలో ఒక రాజు గారున్నారు.ఆయనని కొందరు కృతజ్ఞుడు అంటున్నారని, మరికొందరు కృతఘ్నుడు అనుకుంటున్నారని  చారులు తెలిపారు.రెండు పదాలూ ఇంచు మించు ఒకేలా మనందరికీ కనపడుతున్నా,అసలీ కృతజ్ఞుడు-కృతఘ్నుడు అనే పదాలకు అర్ధం ఆ రాజుకు మాత్రం సరిగా తెలవలేదు.తెలుసు కోవాలనే అతని మనస్సులో కుతూహలం.వేంటనే తన మంత్రిని కేకవేశాడు."నాకు ఈ రెండు పదాలకి అర్ధం సరిగా అర్ధం అయ్యేలా,ప్రత్యక్ష పూర్వకంగా రేపు నువ్వు! దీన్ని  నిరూపించడానికి ఆధారాలేమైనా తీసుకురా"అని ఆజ్ఞ జారీ చేశాడు. చిత్తం!మహ ప్రభో!అని పైకి అన్నాడేకాని,లోలోన కుములుతున్నాడు, ఏమి తేవాలో ఎలా ఈ సమస్యను పరిష్కరించాలో అని.అదే ఆలోచనతో ఇంటికి వచ్చాడు.తెగ ఆలోచిస్తున్నాడు.ఆధారం ఏదీ ఎంత ఆలోచించినా దొరకలేదు.రేపు రాజు గారితో తన పనిఅయిపోయినట్లే!అని మనసులో కొంచెం భయం కూడా పట్టుకుంది.తల బ్రద్దలు కొట్టుకుంటున్నాడు.ఇలా ఉండగా ఆ మంత్రి గారికి ఎంతో తెలివైన ఒక కూతురుంది.తండ్రి డీలా పడి ఉండడాన్ని మొఖంలోనే గమనించి కారణం తెలుసుకుంది.                                          "ఓస్!ఇంతేనా!దానికి అంత తల కొట్టేసు కోసుకోవలసిన పనిలేదు.రేపు మన పెంపుడు కుక్కను,మీ అల్లుడు గార్ని రాజ సభకు తీసుకెల్లండీ!మీ సమస్య చాలా సులభంగా పరిష్కారం అవుతుంది" అని చెప్పి హాయిగా నిద్ర పొమ్మన్నది.
                                    మన మంత్రి గారికి,తన కూతురి ద్వారా అలా మంచి ఆధారం ఇంత సునాయాసంగా దొరకడంతో హాయిగా నిద్ర పోయాడు.మరునాడు ఎప్పటిలా తెల్ల వారింది.తన పెంపుడు కుక్కను, తన అల్లుణ్ణి,రాజ సభలో ప్రవేశపెట్టి ఇలా అన్నాడు."అయ్యా!మీరు తీసుకుని రమ్మన్నఆధారాలు తీసుకొని వచ్చాను"అన్నాడు.అక్కడకు తెచ్చిన ఆ ఆధారాలను చూసి,మంత్రి తనను ఎగతాళి చేస్తున్నాడని రాజు గారికి కోపం వచ్చింది.అప్పుడు మంత్రి,రాజుతో ఇలా అన్నాడు.....

                              "మహా రాజా!ఈ ప్రాణికి ఎంత పెట్టినా "సంతృప్తి" అనేదే లేదు. ఇతని దాహం తీరదు.విశ్వాసం లేదు. మహా రాజా!ఒక విధంగామీరూ,నేనూ కూడా ఒకప్పటి ఒక ఇంటి అల్లుళ్ళమే కదా!మన అత్త మామలు మనకు చేసిన మేలు అప్పుడే,మరచిపోయాము.మరి!ఈ కుక్కను చూడండి! ఇది మాత్రం ఏది పెడితే,అది తింది.ఎంతో విశ్వాసం తోఉంది.నేటికీ మన ఇంటికి కావలి కాస్తూనే ఉంది"అన్నాడు.
                          మంత్రి గారి సమాధానం ఆ రాజుకు చాలా బాగా నచ్చింది.ఇంత గొప్పగా చెప్పిన మంత్రిని ఎంతో ఘనంగాసత్కరించాడు. నిజానికి ఆ సన్మానం దక్క వలసింది తన కూతురుకేనని మనస్సులో భావించాడు ఆ మంత్రి.మనం పరులు చేసిన ఉపకారాన్ని ఎన్నటికీ మరువకూడదని,అలాంటి వాడు కృతజ్ఞుడని,చేసిన మేలు కాస్తా మరచి పోయినవాడు
కృతఘ్నుడనీఆ రాజు ఈ విధంగా తెలుసు కోగలిగాడు. అలా అక్షరాల్లో కొద్ది తేడాతో కనపడుతున్నా ఈ రెండు పదాలకూ ఎంత భేదముందో!

17, సెప్టెంబర్ 2012, సోమవారం

నేటి తల్లి దండ్రుల బాధ్యత

చాలా మంది తల్లిదండ్రులు ఈనాడు మా పిల్లలు మంచి సాహిత్యం, చదవాలి .వారిలో మానవతా విలువలు ,సాంస్కృతిక విలువలు పెరగాలి,ఆధ్యాత్మిక చింతన ప్రబలాలి, నైతిక, ఆధ్యాత్మిక, సామాజిక విలువలతో  మా  బిడ్డల శీల సంపదలు ఇనుమడింప చేయాలనే భావనే కానీ , అవి పెంపొందించడానికి మన వంతుగా ,మనమెంత కృషి చేస్తున్నాము?అనే ప్రశ్న నేటి సమాజంలోని ప్రతి తల్లీ,తండ్రి వేసుకో వలసిందే!మన వంతు బాధ్యతలను మనం సక్రమంగా ఎంత వరకూ నిర్వర్తిస్తున్నామా?అని !ఈ నాడు మేము నవ నాగరికులమని బోర విరుచుకొని చెప్పుకుంటున్న,వారి గృహాలు ఎక్కడ చూసినా ,సెక్స్ సాహిత్యం ,క్షుద్ర సాహిత్యం ,అర్ధ నగ్న దృశ్యాలతో కూడిన పనికి మాలిన  సాహిత్యం ,డిటెక్టివ్ -నవలా సాహిత్యంతో,నిండి పోతూనే ఉందనే విషయం నేడు ఎవరూ కాదనలేరుగా?మరి !మన భావి తరాలెలా?తీర్చి దిద్దబడతారు?మనసు పెట్టి,కొంచెం ఆలోచించండి! సంస్కృతం,తెలుగు వంటి మన ప్రాచీన భాషలు పూర్తిగా మనకే రాక పోవచ్చును.నేర్చుకోవాలనే కోరిక  మరియు అభిలాష కొందరికి  ఏకోశానా లేకపోవచ్చును.మహాను భావులు ఎందరో మన కవులు ఎంతో పరిశ్ర మించి,కేవలం తెలుగు వచనంలోకి అనువదించిన అద్భుతమైన పూర్వ కావ్యాలు ఎన్నిలేవు?పురాణాలెన్ని లేవు? వాటిని కొంచెం సేపైనా ప్రతి రోజూ చదివించ వచ్చుగా?వాటిలో కొన్నైనా , అధమ పక్షం ఇంట్లోనైనా కొని, మన బిడ్డ చూసేలా ఉంచవచ్చుగా! గృహమొక పవిత్రమైన గ్రంధాలయంగా చేసుకోవచ్చుగా!వాటిని కొని ఇంట్లో ఉంచితే ఎప్పుడైనా ఒకసారి కాకపోతే వొకసారైనా ,వాడు తెరచి చూచే అవకాశం మనం కల్పించవచ్చుగా!భావి తరాలకు మంచి పుస్తకాలు ,సంస్కృతీ సాంప్రదాయాలు ,పుణ్య పురుషుల చరిత్రలు , అందించి,మన జాతిని జాగృతం చేసుకుందాం!ఇది తల్లి దండ్రుల మైన మనందరి బాధ్యతగా గుర్తెరిగిన వారు ధన్యులు.అందరినీ ఉద్దేసించి చెప్పిన విషయాలుగా భావించకండి!కొన్నిగృహాలు ఇందుకు భిన్నంగా మన ప్రాచీన ఆర్ష సాంప్రదాయపు ఒరవడిలో ఉండి ఉండవచ్చుకూడా ! అలాంటి వారికి నా జోహారులు.మన బిడ్దల నైతిక విలువల కోసం వేసవి ప్రత్యేక తరగతుల కోసం వేలకు వేలు ఫీజులు పోస్తున్నాం!వారిని ఉద్దేసించి మాత్రమే నా బాధ !మన్నిస్తారుగా!

5, సెప్టెంబర్ 2012, బుధవారం

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః..........

 పిల్లలూ!నేడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పండితుని జన్మదినంకదా!ఈ రోజునే  మరొక పండుగకూడా ఉంది ఏమిటో చెప్పగలరా?అదే ఉపాధ్యాయ దినోత్సవం.అది డాక్టర్ సర్వేపల్లి వారి జన్మ దినం నాడే ఎందుకు చెయ్యాలి?మరొక రోజు చెయ్యవచ్చు కదా!అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది.మరి దానికి నేను సమాధానం చెప్పాలి కదా! ఆయన శిష్యులు,మిత్రులు కొందరు డాక్టర్ సర్వేపల్లి గారి వద్దకు వెళ్ళి అయ్యా!మీ జన్మ దినోత్సవాన్ని మేము ఘనంగా వేడుకగా చెయ్యాలని అనుకుంటున్నాము.దానికి మీరు అనుమతించాలి అని అడిగారు.అదీ ఆయన 74 వ జన్మదినం.అంటే అది 5 సెప్టెంబర్ 1962 వ సంవత్సరం. దానికి ఆయన ఇలా అన్నారు."నా పుట్టిన రోజును అంత వేడుకగా జరపడం నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు.నేను మీకు అధ్యాపకునిగా చిర పరిచితుణ్ణి .కాబట్టి ఈ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే నేనెంతో గర్హిస్తాను"అని చెప్పి,ఉపాధ్యాయ వృత్తి పట్ల తన ప్రేమను, గౌరవ భావాన్ని వ్యక్తం చేశారు.అదుగో !అది !ఆ దినం నుండి ఈ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము.మరి ఆయన జన్మ దినమైన ఈ ఉపాధ్యాయ దినోత్సవ సమయాన వారిని గురించి,వారి గొప్పదనాన్ని గురించి,నాలుగు ముక్కలు మననం చేసుకోవడం మన విధి.
                  మద్రాసుకు 64 కిలోమీటర్ల దూరంలో తిరుత్తణి అనే ఒక ఊరుంది.ఆ ఊర్లో ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలోవీరా స్వామి, సీతమ్మ పుణ్య దంపతులకు ది.5 సెప్టెంబర్ 1888 వ తేదీన జన్మించారు మన సర్వేపల్లి రాధాకృష్ణన్.వీరి మాతృభాష మన తెలుగే !బాల్యం అంతా తిరుత్తణి,తిరుపతి పట్టణాల్లోనే సాగింది.మద్రాసులో స్నాతకోత్తర  విద్యను,M.A పట్టాను పొందిన వీరికి చిరు ప్రాయంలోనే అంటే 18 సం.ల వయస్సు లోనే అంటే 1906లోశివ కామమ్మ గారితో వివాహం అయింది.వీరికి 5గురు కుమార్తెలు,ఒకే ఒక్క కుమారుడు సంతానంగా కలిగారు.
                            క్రమంగా తత్వ వేదాంత శాస్త్రాలను ఆపోసన పట్టి అధ్యాపక వృత్తిలోకి అడుగు పెట్టారు.వారి ప్రతిభా పాటవాలను ఇనుమడింపచేసుకున్న వీరిని ,ఎన్నెన్నో అత్యున్నత పదవులు కోరకుండానే వెతుక్కుంటూ వచ్చాయి.ఒక అధ్యాపకునిగా వీరు చేపట్టిన పదవులు చెప్పాలంటే పెద్ద జాబితా అవుతుంది.మదన మోహన మాలవ్యా అడుగుజాడల్లో బనారస్ విశ్వ విద్యాలయానికి కులపతిగా,వాల్తేరులోని మన ఆంధ్ర విశ్వ విద్యాలయ కులపతిగా,  కలకత్తా విశ్వ విద్యాలయ రూపకర్తగా,ఆక్స్ఫర్డ్  విశ్వ విద్యాలయంలో స్పాల్డింగ్ ఆచార్యునిగా ఎనలేని గౌరవాన్ని,ఎందరెందరో గొప్ప గొప్ప శిష్యులను తన ఆస్తిగా సంపాదించుకున్నారు.1954లొ"భారత రత్న" అయ్యారు.1951 లో యునెస్కో రాయబారిగా వెళ్ళారు.జర్మన్ శాంతి బహుమతిని గుడా పొందిన వీరి మొట్టమొదటి రచన "ది ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్"ఇలాంటి వెన్నోఎన్నెన్నో వారి రచనలు భారతీయ సరస్వతికి కంఠాభరణాలు  అయ్యాయి.
                           కలకత్తా విశ్వ విద్యాలయంలో కింగ్ జార్జ్ చైరును అలంకరించిన తొలి భారతీయుడు మన డాక్టర్ సర్వేపల్లి. తాత్వికునిగా, రాజనీతిజ్ఞునిగా,మహా పండితునిగా,ఉన్న మన రాధా కృష్ణునికి  1931 లో నైట్ హుడ్ ఇచ్చి గౌరవించారు.అప్పటి నుండి సర్ బిరుదు చేర్చి పిలువబడుతూ ఉండేవాడు.అలాగే రష్యా అధినాయకుడైన స్టాలిన్ కు తత్వాన్ని,జ్ఞానోపదేశం చేసి ఘనత మన డాక్టర్ సర్వేపల్లికి దక్కింది.
                                        రాజనీతికోవిదుడైన మన
డాక్టర్ సర్వేపల్లి స్వాతంత్ర్యా నంతరం మొట్ట మొదటి ఉప రాష్ట్ర పతి పదవి,ఆ తరువాత రాష్ట్ర పతి పదవి వీరిని వరించింది.వారికి గౌరవ సూచకంగా మన రాజధాని నగరంలో ట్యాంక్ బండ్ మీద వీరి శిలా మూర్తి ప్రస్ఫుటంగా చూపరులకు మనకు కనువిందు చేస్తూ ఉంటుంది. మూర్తీ భూత భారతీయ సంస్కృతి,వేదాంత విజ్ఞాన సందీప్త సుకృతి డాక్టర్ సర్వేపల్లి. మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం అంటరు సర్వేపల్లి. ఎంత గొప్ప స్థానాన్ని చేరినా సరే!విద్యార్ధిగా ఉండు!అంటారు వారు. అలాగే ద్వేషాన్ని ద్వేషంతో చల్లార్చలేము.ప్రేమాభిమానాలతోనే చల్లార్చ గలమంటారు.అలాంటి మన సర్వేపల్లి రాధా కృష్ణ పండితుని గూర్చి ఎంత చెప్పుకున్నా తరగని చరిత్ర వారిది.అలాంటి వారి జన్మ దినాన్ని ఈనాడు వారి కోరినట్లు ఉపాధ్యాయ దినోత్సవంగా దేశమంతా ఘనంగా జరుపుకోవడం నిజంగా వారి గొప్ప మనసుకు నిదర్శనం. వారి అడుగు జాడల్లో మనమందరం నడుస్తూ ,మీ మీ ఉపాధ్యాయుల్ని వారి సేవలను,కొనియాడుతూ మీ గురుభావాన్ని ప్రకటించుకుంటారని మనసా వాచా కర్మణా ,కోరుతూ వారి అడుగుజాడల్లో మీరంతా గొప్పవారు కావాలని కోరుకుంటూ,వారికి నా వినమ్ర ప్రణామాలను అందజేస్తూ,నా గురుదేవులందరికి, పేరుపేరునా శుభాకాంక్షలు తెలుపు కుంటున్నాను.
                                                                   

1, సెప్టెంబర్ 2012, శనివారం

"దండం దశ గుణం భవేత్"

ఇటీవల ఒక మిత్రుడు తన మాటల్లో,"దండం దశ గుణం భవేత్" అంటారు గదా!దండం పెట్టడం పది రకాలట గదా ! అ దండాల గురించి కొంచెం చెపుతారా ? అని నా మీద,ఒక ప్రశ్నా బాణాన్ని సంధించాడు. నాకు చాలా ఆశ్చర్యమేసింది!ఇదేమిటి? దండం ఏమిటి ?పది రకాలేమిటి?అని.ఆతను భావించినట్లుగా ,ఇక్కడ" దండం " అంటే, మీరు కూడా నమస్కారం అనుకుంటారేమో?ఇక్కడ "దండం "అంటే,"చేతి కర్ర" అని అర్ధం."దండ ప్రమాణం" అనే మాట కూడా ఇందులోంచి వచ్చినదే! ఇది పూర్వ కాలం గురువుల చేతుల్లో,ఎక్కువగా చిన్న సైజులో కనుపించేది.దాన్ని" బెత్తం " అని మా రోజుల్లో పిలిచేవారు.అలాగే , చిన్నికృష్ణుడు  గోవులను మేపుతూ,విమల శృంగము,వేత్ర దండము ధరించాడని,పోతన మహా కవి భాగవతంలో వర్ణించాడు కూడా .మా రోజుల్లో విద్యార్ధులకు, సగానికి సగం, క్రమశిక్షణ దీని ,ద్వారానే అలవడేది.అంటే! మీరు నమ్ముతారా?భయానికి మారు పేరుగా ఈ దండం..నాడు ఉపాధ్యాయుల చేతుల్లో,తరచూ ఇది కనుపిస్తూ ఉండేది.
                                    ఇప్పుడు దీని పేరెత్తినా,ఇది చేతిలో కనిపించినా, ఉపాధ్యాయులను శిక్షించమని! ప్రభుత్వం వారు ఉత్తర్వులు దఖలు పరిచారు.అది వేరే విషయం అనుకోండి!.అలా అంటే,మీ వంటివారు కూడా,ఎంతమంది ఉపాధ్యాయులు బిడ్డల్నిశిక్షించడం లేదు ?ఎన్ని కేసులు చూడడం లేదు? అంటూ నన్ను ప్రశ్నిస్తారు.ఐతే ఇక  అసలు విషయానికి వద్దాం!ఈ" కర్ర " మనకు సన్యసించిన ,స్వామీజీల, అవధూతల,అఘోరాల, చేతిలో,పొడవైన దండం లాంటిది,మనం చూస్తూ ఉంటాం.దానికి కాషాయ వస్త్రాలు కూడా చుట్టి ఉంటాయి.అందుకే వారిని" త్రిదండి "వంటి గౌరవ పదాలను ముందుంచి, పిలుస్తూ ఉంటాము.వారి మనో, వాక్, కాయ రూపాలను ఈ దండంగా  భావించి,మనం ఈ పేరుతొ గౌరవిస్తూ ఉంటాం.మనం వారికి చేసే,ప్రతీ నమస్కారమూ, ఈదండం ద్వారా భగవంతునికి చేరుతుందని,భక్తుల నమ్మకం.ఇలా చెప్పుకుంటూ పోతే... ఈ దండం,మనకు 10 రకాలుగా నిత్య జీవితంలో ఉపయోగపడుతూ ఉంటుంది.కాబట్టే 
" దండం దశ గుణం భవేత్" అనే వాక్యం వచ్చింది.ఆ పది ఉపయోగాల లోక భావాన్ని కలిగిన,ఒక  చిన్న శ్లోకాన్నిఇక్కడ మనం ముచ్చటించుకుందాం.
                                           "  విశ్వా~మిత్రా~హి, పశుషు,
                                                కర్దమేషు ,జలేషు చ,
                                                 అంధే,తమసి వార్ధక్యే,
                                                 దండం దశ గుణం భవేత్."
 అంటే!నిత్య జీవితంలో,మానవునికి ఈ దండం అనేది 10 రకాలుగా  ఉపయోగపడుతోంది.
1. "వి "=అనగాపక్షులను,అదలించడానికి,
2" శ్వ" =అనగా కుక్కలను ,బెదరించడానికి,
3. "అమిత్ర "=అనగా శత్రువులనుండి ఆత్మ రక్షణ పొందడానికి,
4. "అహి "=అనగా పాములనుండి,రక్షణ పొందడానికి,
5."పశుషు "=పశువులను,అదలించడానికి,
6 "కర్దమేషు "=అనగా బురద వంటి ప్రదేశాల్లో, పడకుండామన కాపుకోసం,
7. "జలేషు "=జలాలలో దిగినప్పుడు,లోతు,తెలుసుకోవడానికి,
8." అంధే"=కనుచూపు లేనివారికి,ఊతగాను
9. "తమసి "=చీకటిలో ,రక్షణగాను,
10."వార్ధక్యే "=ముసలితనంలో ,ఊతంగాను,
ఇలా ఈ దండాన్ని ఉపయోగించుకోవచ్చును.అని చెబుతాం.ఈ దశ గుణాలను మనం రోజూ అనుభవిస్తూ ఉన్నా,ఆ విషయాన్ని వదిలేసి,కేవలం నేడు" వీధిజనభయంకరుల " చేతుల్లో,ఆయుధాలుగా మాత్రమే మనం ఊహించుకుంటూ, ఈ దండానికి మనమే,విపరీతార్ధాలుతీస్తున్నా,ఈ అసలు అర్ధాలను గమనించమని నా మిత్రునితో చెప్పిన విషయం, అందరికీ  ఉపయోగిస్తుందని మీతో ఈ రోజు ఇలా ప్రస్తావించాను.ఇందులోని మంచిని గ్రహించండి.చెడునివిసర్జించండి.