1, జనవరి 2012, ఆదివారం

"కొంటె తెనాలి"

అది శ్రీ కృష్ణదేవ రాయల ఆస్థానం.
ఒక నాడు నేల మీద ఆకు పచ్చని తివాసీ పరిచారు.
సేవకులు.మంత్రులు,సామంతులు,దండ నాధులు, పురోహితులు,అష్ట దిగ్గజ కవులు,పౌరులు అందరూ కొలువు తీరి కృష్ణ దేవ రాయల వారి ఆగమనం కోసం ఎదురు చూస్తున్నారు.
ఆ సమయంలో రాయలు కూడా సభా మండపమైన భువన విజయ సభాస్థానానికి వేంచేశారు.
సభ ప్రశాంతంగా మొదలయింది.కేవలం ఆ సభకు హాజరు కానిదల్లా ఒక్క తెనాలి రామకృష్ణ కవి మాత్రమే.
ఈలోగా కొంత ఆలస్యంగా మన తెనాలి రామకృష్ణ కవి ఆస్థానంలోనికి ప్రవేసిస్తున్నాడు.
అతన్ని గుమ్మం దగ్గర చూడగానే,రాయల వారు నవ్వుతూ ఇలా అన్నాడు.
"కవి వృషభులకు స్వాగతం!ఈ పచ్చని తివాసీ మీ కోసమే వేయ బడింది."అన్నాడు.
వెంటనే మన రామ కృష్ణ కవి అందులోని వ్యంగాన్ని గుర్తించి ఇలా సమాధానమిచ్చాడు.
"కామ ధేనువు లాంటి ప్రభువులుండగా కవి వృషభులకు కొరతేమిటి ప్రభూ?"అని కొంటెగా చమత్కరించాడు.
అతనన్న మాట వల్ల తనకు దెబ్బ తగిలిన మాట వాస్తవమే! అయినా అతని అపార వైదుష్యాన్ని సహృదయతతో గుర్తించి అతని సమయ స్ఫూర్తిని బహుధా ప్రశంసిస్తూ అందరితో పాటు తానూ బిగ్గరగా నవ్వుతూ అతన్ని అభినందించాడు.
అదీ తెనాలి కొంటెతనంలో గొప్పదనం.అందుకే తెనాలి "కొంటె తెనాలి"గా కీర్తింపబడ్డాడు.