19, ఏప్రిల్ 2012, గురువారం

SCHOOL LIFE


బావా!తప్పుడు మాటలేల....

"కవి సార్వభౌమ" శ్రీనాధ మహాకవి
"సహజ కవి"బమ్మెర పోతన
శ్రీనాధుడు పోతన బావా,బావ మరదులౌతారని లోకంలో ప్రచారముంది.ఇద్దరూ మహా కవులే!ఇద్దరూ ఉద్గ్రంధ రచయితలే!
ఇద్దరూ జగత్ప్రసిద్ధులే. ఇద్దరూ మంచి ఉపాసనా పరులే.ఇద్దరూ బ్రహ్మజ్ఞాన సంపన్నులే.కానీ శ్రీ నాధుడు భోగ మార్గాన్ని,పోతన యోగ మార్గాన్నీ,యెన్ను కున్నారు.అదే వారిలో కొంచెం తేడా!శ్రీ నాధుని దృష్టిలో పరం మాట ఏమో గానీ,ఇహం మాత్రం సత్యం!బ్రతికున్నంత వరకూ,అన్నీ పుష్కలంగా అనుభవించాలనే తత్వం అతనిది.అందు చేతనే రాజులకీ, మంత్రులకీ,స్నేహితులకీ,పీఠాధిపతులకీ,ఎవరు కనబడితే వాళ్ళకల్లా తన గ్రంధాన్నిఅంకితమిచ్చివాళ్ళిచ్చినవన్నీ పుచ్చుకుని హాయిగా సుఖ భోగాలు అనుభవించి కవిసార్వభౌముడయ్యాడు.దీనార టంకాల తీర్థమాడాడు శ్రీ నాధుడు.తన "పలనాటి వీర చరిత్ర"ను అంకితం తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు కాబోలును!చెన్నకేశవ స్వామికి అంకితమిచ్చిభగవదంకితం అసలే చేయలేదనే అపప్రధనుండి తప్పించుకున్నాడు!
కానీ పోతన దీనికి పూర్తిగావ్యతిరేకం.
             ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు,వాహనమ్ములున్
          సొమ్ములు కొన్ని పుచ్చుకొని,చొక్కి,శరీరము వాసి,వాలుచే
సమ్మెట వ్రేటులంబడక,సమ్మతి శ్రీ హరికిచ్చి చెప్పెనీ
    బమ్మెర పోతరాజొకడు!భాగవతమ్ము! జగద్ధితమ్ముగన్.
అని తాను రచించిన మహోదాత్తమైన శ్రీమదాంధ్ర మహా భాగవత  పురాణాన్నిశ్రీ మన్నారాయణునకే అంకితమిచ్చి,తన జన్మను ధన్యం చేసుకున్నాడు భక్త కవి పోతన.
      శ్రీ నాధుని స్వభావానికి అపవాదంగా,ఏ పరిస్థితులలో నైతేనేమి? ఒక్క గ్రంధాన్నైనా భగవదంకితం చేసినట్లు,పోతన తత్వానికి విరుద్ధంగా చిన్నదో,పెద్దదో,ఏదో ఒక గ్రంధాన్నైనా నరాంకితం చేయకుండా వున్న వాడు కాదు.వేశ్యావర్ణన ప్రచురమైన తన భోగినీ దండకాన్ని సర్వజ్ఞ సింగ భూపాలుడికి అంకితం చేశాడు.ఐతే అది ఎప్పుడో,ఉడుకు రక్తం ఉప్పొంగే, చిన్ననాటి మాట!ఐనా!జీవితం యొక్క స్వచ్చతని మలినీకరించడలో పాత్ర వహిస్తూ సోకిన ఆ కొంచెం పాటి కళంకం కూడా కళంకమే. అందుచేతనే"ఇమ్మనుజేశ్వరాధముల"కివ్వ గూడదని నియమం పెట్టుకున్నాడు కాబోలు."రాజైన వాడు ఎవ్వడికీ ఇవ్వగూడదని కాక పోవచ్చును.రాజుల్లో అధములైన వాళ్ళకే ఇవ్వగూడదు. ఉత్తము లైతే ఇవ్వవచ్చునేమో!"అనేది అతని ఉద్దేశ్యంగా విశ్లేషించుకుంటే,సర్వజ్ఞ సింగ భూపాలుడు మాత్రం ఉత్తముడనడంలో ఏమాత్రం సందేహం లేదు.కానీ అతడే భాగవతాన్నితనకంకితమిమ్మని కబురు చేస్తే పోతన ఇవ్వనని భీష్మించుకొని కూర్చున్నాడని,రాజు హఠం చేసి,ఆ గ్రంధాన్ని బలవంతంగా తెప్పించి పాతి పెట్టించాడనే ఉదంతం మళ్ళీ దీన్నికొంచెం దెబ్బ తీస్తోంది.బహుశా!చిన్ననాడు ఉత్తముడనిపించిన ఆ రాజు పరిణతి వయస్సులో తనకి అధముడుగా గోచరించాడేమో! వయ:క్రమంలో అభిప్రాయాలు మారిపోవడం అసహజం కాదుకదా!
                అలాంటి పోతన దగ్గరికి శ్రీ నాధుడొకసారి వచ్చి "బావగారూ! మీరు భాగవతం వ్రాశారనీ,అది చాలా బాగుందనీ, వింటున్నాను.చాలా సంతోషం.కానీ నేను దానిని ఎప్పుడూ కనలేదు వినలేదు .ఏదీ!ఒక మాంచి ఘట్టం చదివి వినిపించండి!నాకు మీ కవితా విందు చెయ్యండి! అని కోరాడు.అప్పుడు పోతన గజేంద్ర మోక్ష ఘట్టం వినిపిస్తూ,మొసలి చేత పట్టుకోబడి,బహుకాలం స్వ సంరక్షణ విషయంలో చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలం కాగా సంపూర్ణ శరణాగతికి పాల్పడ్డ గజేంద్రుడు,
లావొక్కింతయులేదు,ధైర్యము విలోలంబయ్యె,ప్రాణంబులున్
ఠావుల్ దప్పెను,మూర్చ వచ్చె,తనువున్ డస్సెన్,శ్రమంబయ్యెడిన్,
నీవే తప్ప నిత:పరంబెరుగ,మన్నింపందగన్ దీనునిన్,
రావే!ఈశ్వర!కావవే!వరద!సంరక్షించు!భద్రాత్మకా!
అని వేడుకొనేటప్పటికి విష్ణు భగవానుడు అతనికప్పుడు కుదిరిన అనన్య భక్తికి మెచ్చి,అతని కస్టానికి చలించిపోయి
సిరికిం చెప్పడు,శంఖ చక్రయుగమున్ సంధింపడే
పరివారంబును జీర,డభ్రగ పతిం బన్నింప,డాకర్ణికాం
తర ధమ్మిల్లము చక్కనొత్తడు,వివాద ప్రోత్థిత శ్రీ కుచో
పరి చేలాంచలమైన వీడడు,గజ ప్రాణావనోత్సాహియై.
 వెంటనే శ్రీనాధుడు హేళన ధ్వనించే స్వరంతో ఏమిటేమిటీ?బావగారూ! భక్తుడు మహాపదలో చిక్కుకొని,ఆర్తనాదం చేశాడని జాలిపడ్డ ఆ జనార్దనుడు శంఖ చక్రాలే ధరించలేడా?పరివారాన్ని వెంట బెట్టుకోలేదా? కనీసం వాహనమైన గరుత్మంతుణ్ణి కూడా సిద్ధపరచుకోలేదా?ఏ సాధనమూ లేకుండా భక్తుణ్ణెలా రక్షిద్దామని వచ్చాడు?ఇది అతని స్వభావానికే విరుద్ధం.ఇలాంటి వర్ణనలు చేస్తే,సామాన్యుల మాటేమోగానీ, మాబోటి!మాన్యులు,సాహితీ మర్మజ్ఞులు మాత్రం మెచ్చుకోరు!అని ఆక్షేపించాడు.అధిక్షేపించాడు కూడా!
         శ్రీనాధుని మాటలకు పోతన కోపం తెచ్చుకోవడంగానీ,ఉడుకు మోత్తనం చూపడం కానీ,తన వాదాన్ని సమర్ధించుకోవడానికి ప్రయత్నించడం కానీ,ఏమీ చెయ్యక బావా!తప్పుడు మాటలేల?అని, ఊరికే ఒక చిన్నచిరునవ్వు నవ్వి,అప్పటికూరుకొన్నాడు.తరువాత అందరూ భోజనాలకు లేచే సమయంలో శ్రీ నాధుడు చుట్టం చూపుగా, తన ఇంటికొచ్చేటప్పుడు తనతో కూడా,వెంట బెట్టుకొని వచ్చిన అతని మనుమణ్ణి భద్రంగా ఒకచోట దాచాడు.ఒక పెద్ద బండ రాతిని నూతిలో పడవేసి అయ్యయ్యో!మీ మనుమడు నూతిలో పడిపోయాడని శ్రీ నాధుని దగ్గరకు వచ్చి,ఘొల్లుమన్నాడు మన పోతన.
                           శ్రీ నాధుడు విస్తరి ముందు కూర్చోబోయేవాడల్లా అయ్యో!అయ్యో!అంటూ గుండెలు బాదుకుంటూ,దొడ్లోకి పరుగెత్తుకెళ్ళి నూతి చుట్టూ పిచ్చెత్తిన వాడిలా తిరుగుతున్నాడు.అప్పుడు మన పోతన "ఇదేమి విడ్డూరం మహా కవీశ్వరా?కవిసార్వభౌమా!కేవలం తమ మనవడు నూతిలో పడిపోతే,ఒక నిచ్చెనకానీ,ఒక మోకుగానీ తీసుకురాకుండా,వాళ్ళనీ వీళ్ళనీ పిలవడం గానీ,ఏమీ లేకుండా!కేవలం గుండెలు బాదుకుంటూ పరుగెత్తుకొచ్చి,ఏ సాధనమూ లేకుండా మనవణ్ణెలా బయటకు తీసి,రక్షిద్దామనుకున్నారు?ఇది మీ  వంటి మాన్యులకు,వారి స్వభావానికి సముచితమా?అనుచితమా?అని 
దెప్పిపొడిచాడు.అప్పుడు శ్రీ నాధుడు సిగ్గుపడి బావగారూ!మీ భాగవత వర్ణన సహజమే!నేను చేసిన అహంకార పూరితమైన వ్యాఖ్యనుఇప్పుడే! ఉప సంహరించు కుంటున్నాను.నన్నుక్షమించు!ఆ సమయంలో ఉన్నవాడు ఉన్నట్టు రావడమే లోక సహజం!కానీ సాధన సామగ్రి కోసం తడుముకోవడం!అనుభవ సిద్ధం కాదు.అంటూ,ఇంతకీ నా మనుమడేడీ? అని అడిగాడు.అప్పుడు పోతన చిరు నవ్వు నవ్వుతూ,తానంతకు ముందు దాచిన చోటు నుంచి పిల్లాడిని తీసుకొని వచ్చాడు.వాడూ వస్తూనే తాత గారూ!అనిశ్రీ నాధుడి వద్దకు పరుగెత్తుకొని వెళ్ళాడు. మనుమణ్ణి చూడగానే ఏనుగెక్కినంతగా సంతసిస్తూ,శ్రీ నాధుడు అతణ్ణి ఎత్తుకొని ముద్దాడాడు.